Thursday, 18 August 2011

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో

ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఉత్తరద్వారం మూసివేత

వేములవాడ, ఆగస్టు 18: సుప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయ ఉత్తరద్వారాన్ని 45రోజులుగా మూసివేశారు. ఇటీవల ముంబయిలో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన నేపథ్యంలో ఆలయానికి భద్రత కల్పించడంలో సరైన ఫోర్స్ లేకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తరద్వారం మూసేయాల్సిందిగా సూచించారు. అప్పటి నుంచి ఉత్తరద్వారాన్ని మూసివేసి మహాద్వారం గుండా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. గతంలో రెండు మహాద్వారం, ఉత్తరద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకునే వీలుండేది. ఆగమశాస్త్రం, వాస్తు ప్రకారం ఉత్తర ద్వార స్థానమనేది ఆలయానికి కుబేరస్థానమని, ఆ స్థానాన్ని మూసివుంచడం ఆలయానికి అరిష్టమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది తెలిసిన ఆలయ అర్చకులకు, వేదపండితులు మాత్రం పెదవి విప్పడం లేదు. అయితే ఈద్వారం తెరుచుకుంటేనే ఆలయానికి ధనం సమకూరుతుందని వేదపండితులు చెబుతున్నారు.
ఆలయ భద్రత కోసం 10 మంది సాయుధ ఎస్‌పిఎఫ్ బెటాలియన్, 40 మంది హోంగార్డ్సు వీరికితోడు ఏపిఎస్‌పి బెటాలియన్ ఆలయ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నారు. ఇంతమంది సిబ్బంది వున్న మళ్లీ భద్రతలేదని ఆలయాధికారులు చెప్పుకొస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానిక నేతల నుంచి ఒత్తిడి రావడంతో భక్తుల రద్దీ వుండే ఆది,సోమ,శుక్రవారాలలో మాత్రమే ఉత్తరద్వారాన్ని అలా తెరిచి ఇలా మూసివేస్తున్నారు. కాగా ఆలయం సాంప్రదాయ విలువలకు, సాంస్కృతికి విరుద్ధంగా ఆలయాధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై మాజీ ధర్మకర్త సుదర్శన్‌యాదవ్ ధ్వజమెత్తారు. స్థానాచార్యులు, అర్చకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఉత్తరద్వారం మూసివేయడం ఆగమశాస్త్రానికి విరుద్ధమని అన్నారు. అవసరమైతే సిబ్బందిని పెంచుకోవాలే తప్పా ప్రాశస్త్యం గల ఉత్తరద్వారం మూసివేయడం విడ్డూరంగా వుందని అన్నారు.

0 comments:

Post a Comment